
Thatikonda Rajaiah: గతంలో తెలంగాణ సాధన కోసం అధికార పార్టీని వదిలి ఇంటింటికి తిరిగి 33 ఓట్ల మెజారిటీతో గెలిచానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ప్రతీ రోజు కేసీఆర్ పిలుపుతో ప్రజలల్లోకి వెళ్లాను, పల్లె నిద్రలు చేస్తూ ప్రజలతో గడిపానని ఆయన తెలిపారు. 2004కు ముందు కడియం శ్రీహరి జిల్లా మంత్రిగా ఉండి అభివృద్ధి చేయడం వాస్తవమన్నారు. నియోజకవర్గంలో రిజర్వాయర్లు, చెక్డ్యాములకు నిధులు ఇచ్చిన ఘనత మంత్రి హరీష్ రావుదని రాజయ్య వెల్లడించారు.
నియోజకవర్గం విద్యారంగంలో ఎడ్యుకేషన్ హబ్గా తయారయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయుంచుకున్నామని, నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్గా తయారయ్యిందన్నారు. 100 పడకల ఆసుపత్రిని సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు నియోజకవర్గం నిండు కుండలా అయ్యిందన్నారు. అధిష్టానానికి కట్టుబడి తన వంతుగా గెలిపిస్తానన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ అవసరమున్నా అక్కడికి వచ్చి ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. 2004 లో గుండె విజయరామారావును గెలిపించానన్నారు. ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా పసునూరి దయాకర్ను గెలిపించానన్నారు. తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తన సేవలను నియోజకవర్గానికి కేటాయిస్తానన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.