
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరీ బస్సు యాత్ర నేడు వికరాబాద్ తాండురులో ప్రారంభమైంది. అయితే.. ఇవాళ ముఖ్య అతిథిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. మీ ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. పదేళ్లయినా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాము.. కానీ పదేళ్లయినా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసామన్నారు డీకే శివకుమార్. అంతేకాకుండా.. గృహజ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన తెలిపారు.
కర్ణాటకలో ప్రతీ మహిళకు నెలకు రూ. 2000 అందిస్తున్నామని, మేం చెప్పేది నిజమో కాదు కర్ణాటకలో ప్రతీ ఇంటికి వెళ్లి అడగండి…. మీకే తెలుస్తుందన్నారు డీకే శివకుమార్. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రతీ మహిళకు కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం అందించనుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని డీకే శివకుమార్ వెల్లడించారు. బీజేపీ కి బీ టీమ్ లా బీఆరెస్ వ్యవహరిస్తోందని, కేసీఆర్.. కేటీఆర్ కు సవాల్ విసురుతున్నానన్నారు. మీరు కర్ణాటకకు రండి… మేం ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తామన్నారు డీకే శివకుమార్. తేదీ , సమయం మీరు చెప్పండి…మిమ్మల్ని బస్సులో తీసుకెళ్లి నిరూపించడానికి మేం సిద్ధమన్నారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.