
Donald Trump: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో యూదులతో సమావేశమైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం లాస్ వేగాస్ లో రిపబ్లిక్ యూదు కూటమి సమావేశంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడు తిగిరి ఎన్నికైతే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రకటించారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులను మన దేశం నుంచి బయటకు రానీయకుండా చూస్తానని అన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మీకు ట్రావెల్ బ్యాన్ గుర్తుందా..? నేను అధ్యక్షుడినైతే మొదటిరోజే ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరిస్తానని చెప్పారు. 2017లో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ మరియు మొదట్లో, ఇరాక్ మరియు సూడాన్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులపై భారీ ఆంక్షలు విధించారు.
అయితే ఈ ఉత్తర్వులు మతపరమైన ఒక సమూహంపై వివక్ష చూపుతుందని కోర్టుల్లో సవాల్ చేశారు. ట్రంప్ దిగిపోయాక, జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత 2021లో మొదటి వారంలోనే ఈ నిషేధాన్ని రద్దు చేశాడు. బైడెన్ కన్నా పూర్వం ఉన్న ప్రభుత్వం అమెరికన్ కాని ముస్లింలపై నిషేధాన్ని విధిస్తే, బైడెన్ దీన్ని రద్దు చేయడం గర్వంగా ఉందని వైట్ హౌజ్ ప్రతినిధి చెప్పారు.
ఇజ్రాయిల్ మా మిత్రదేశం, మిత్రదేశాన్ని ఎన్నడూ లేనంతగా రక్షిస్తానని ట్రంప్ అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం నాగరికత-క్రూరత్వం, మంచి-చెడుల మధ్య పోరాటంగా ట్రంప్ అభివర్ణించారు. దీనికి ముందు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకు లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లను వెరీ స్మార్ట్ అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూను విమర్శించారు. తాజాగా ట్రావెల్ బ్యాన్ గురించి మాట్లాడారు.
అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ వైపు 1400 మంది చనిపోగా.. ఇజ్రాయిల్ గాజాపై జరిపిన దాడుల్లో 7000 మందికి పైగా మరణించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్న 200 మందికి పైగా ప్రజలను విడిపించేందుకు ఇజ్రాయిల్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ భూతల దాడులను ప్రారంభించింది.