Leading News Portal in Telugu

Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు!


Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు!

PM Modi announced ex gratia for Vizianagaram Train Accident Deaths: విజయనగరం రైలు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగిందని, పలు బోగీలు పట్టాలు తప్పినట్లుగా సీఎంఓ అధికారులు సీఎంకు తెలపగానే.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు.

రైలు ప్రమాదంలో ఇతర రాష్ట్రాల వారు మరణిస్తే రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఘటన గురించి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం ఆదివారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయక బృందాలు అప్రమత్తం అయ్యాయని సీఎం రైల్వే మంత్రికి వివరించారు. క్షతగాత్రుల్ని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు విజయనగరం రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. ఇక రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఏపీ సీఎం జగన్‌తోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సీఎం వివరించారని పేర్కొంది.