Leading News Portal in Telugu

AP High Court: రుషికొండ నిర్మాణాలపై కేంద్రానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు


AP High Court: రుషికొండ నిర్మాణాలపై కేంద్రానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖపట్నంలోని రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరిశీలన కోసం ఓ టీమ్ ని నియమించింది. ఆ కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఓ రిపోర్ట్ ఇచ్చింది. అయితే, పర్మిషన్ కి మించి నిర్మాణాలు చేస్తున్నట్లు ఆ టీమ్ తెలిపింది. అయితే, సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చుతున్నానంటూ, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీని కూడా వేశారు. రుషికొండపై కొత్తగా చేపట్టిన నిర్మాణం బాగుందంటూ ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు రెడీ అయింది. దాంతో రుషికొండ ఉల్లంఘనలపై మొదట్లో పిటిషన్లు వేసిన వారు హైకోర్టులో మరో పిల్ దాఖలు చేశారు.

తాజాగా, రుషికొండ నిర్మాణాలపై మరోసారి ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి ఎంక్వైరీ చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు నొటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొనింది.

ఇక, రుషికొండపై 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేస్తున్నారని పలు పిటిషన్లు హైకోర్టులో వేశారు. విచారణ సందర్భంగా అనుమతికి మించి 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్టు జగన్ సర్కార్ ఒప్పుకుంది. అయితే, అంతకంటే ఎక్కువే తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించడంతో కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే చేసింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో రుషికొండలో కేంద్రం మరోసారి సర్వే చేసే అవకాశం ఉంది.