
ICID 25th Congress: విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక అయ్యింది.. రుషికొండ ఐటీ హిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభమైంది.. విశాఖ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది.. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో పాటు రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్, దేశవిదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
57 ఏళ్ల తర్వాత భారత్లో జరుగుతున్న ఈ సదస్సు విశాఖలో జరుగుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం వైఎస్ జగన్, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సును ప్రారంభించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అన్నారు.. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. కాగా, 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరు కాగా.. నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే అజెండాగా చర్చలు సాగనున్నాయి..