Leading News Portal in Telugu

Tulasi Reddy: చంద్రబాబు రూ.2 లక్షల కోట్ల అప్పు చేస్తే.. జగన్‌ ఏడున్నర లక్షల కోట్లు చేశారు.


Tulasi Reddy: చంద్రబాబు రూ.2 లక్షల కోట్ల అప్పు చేస్తే.. జగన్‌ ఏడున్నర లక్షల కోట్లు చేశారు.

Tulasi Reddy: చంద్రబాబు ఐదేళ్ల హయాంలో రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగేళ్లలో ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ ఎన్. తులసి రెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు రాహుకేతువుల్లాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాపురించాయని ఆరోపించారు.. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా చేశాడు.. 1956 నుండి 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ అప్పు లక్ష కోట్లు.. చంద్రబాబు ఐదేళ్ల హయాంలో రెండు లక్షల కోట్లు చేస్తే.. సీఎం జగన్ నాలుగేళ్లలో ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, జగన్ పాలనలో రాష్ట్రం రౌడీ రాజ్యం అయిపోయింది.. ఎర్రచందనం, ఇసుక మద్యం, ల్యాండ్ మాఫియాగా తయారైందన్నారు.. రాష్ట్రంలో అన్ని రకాల పన్నులు.. కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచారు.. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ దినచర్యగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 685 మండలాలకు 400 పైచిలుకు మండలాల్లో కరువు ఉంటే.. కేవలం 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేనలకు ప్రత్యేక హోదా తీసుకొచ్చే శక్తి లేదు.. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ ఎన్. తులసి రెడ్డి.