
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న లగ్జరీ బస్సును ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు కేసీఆర్ కొత్తగూడెం వెళుతుండగా ‘ప్రగతి రథం’ బస్సును ఈసీ అధికారులు పోలీసుల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అధికారులు, పోలీసు సిబ్బంది ప్రతి మూలను తనిఖీ చేస్తూ కనిపించారు. బ్యాగులు, బుట్టలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే పెట్టెలను కూడా తెరిచారు. వాహనంలో ఉన్న టాయిలెట్స్ను కూడా తనిఖీ చేశారు.
ఈ మొత్తం తనిఖీలను పోల్ అధికారులు వీడియో రికార్డు చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు సీఎం కేసీఆర్ పూర్తిగా సహకరించారు. తనిఖీకి సహకరించిన సీఎం కేసీఆర్కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి శనివారం కామారెడ్డికి వెళ్లి ప్రసంగించేందుకు వచ్చిన సమయంలో ఆయన కారును కూడా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీల కార్లను కూడా ఈసీ అధికారులు తనిఖీ చేశారు. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.