
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఆమెపై విచారణ జరిపింది. అంతకుముందు మహువా మోయిత్రాపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేను కూడా విచారించింది.
ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ మహువాపై చర్యలు తీసుకునేందుక సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదికను సిద్ధం చేసింది. ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ చేసిన సిఫారసులను ఫ్యానెల్ ఆమోదించింది. 6:4 మెజారిటీలో సభ్యులు తీర్పును ఆమోదించినట్లు తెలుస్తోంది. మహువాపై చర్యలు తీసుకోవాలని ఆరుగురు సభ్యులు మద్దతు తెలుపగా.. నలుగురు మాత్రం వ్యతిరేకించారు. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, హేయమైనవని, ఆమె నేరం చేసిందని చెబుతూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్యానెల్ సూచించినట్లు తెలుస్తోంది. కమిటీ సిఫారసులను రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నారు.
మహువా మోయిత్రాపై చర్యలకు మద్దతు తెలిపిన సభ్యుల్లో అపరాజిత సారంగి, రాజ్దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, ప్రణీత్ కౌర్, వినోద్ సోంకర్, హేమంత్ గాడ్సే ఉన్నారు. వ్యతిరేకించి వారిలో డానిష్ అలీ, వి వైతిలింగం, పిఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్ ఉన్నారు.
పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ.. అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగారని, అందుకోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె లంచం తీసుకుందని మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకుందని, వారు దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయ్యారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పీకర్ ఓంబిర్లాతో పాటు ఐటీ శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ లకు దూబే లేఖలు రాశారు.
మరోవైపు దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్ ముందు ఈ ఆరోపణపై అఫిడవిట్ సమర్పించారు. తన నుంచి మహువా మోయిత్రా గిఫ్టులు, ఇతర సహాయాలు తీసుకుందని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఎథిక్స్ ప్యానెల్ కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు తెప్పించుకుని మహువా మోయిత్రాను విచారించింది.