Leading News Portal in Telugu

Bandi Sanjay : మై డియర్ కల్వకుంట్ల కమీషన్ల రావు… నువ్విక మాజీ సీఎంవే


Bandi Sanjay : మై డియర్ కల్వకుంట్ల కమీషన్ల రావు… నువ్విక మాజీ సీఎంవే

‘‘మై డియర్ కల్వకుంట్ల కమీషన్ రావు…. నువ్వు ఏం చేశావని బీఆర్ఎస్ కు ఓటేయాలి? కుంగిపోయిన కాళేశ్వరం చూద్దామంటే రావు… 317 G.O వల్ల చనిపోయిన ఉద్యోగ కుటుంబాల దగ్గరికి రావూ…. టీఎస్పీఎసీ పేపర్ లీకేజీతో వల్ల నష్టపోయిన విద్యార్థుల దగ్గరికి రావూ… ఉద్యోగుల సమస్యలపై చర్చలకు రావు…పోడు పట్టాల కోసం పోలీస్ దెబ్బలు తిన్న గిరిజన బిడ్డల దగ్గరికి రావు… అసలు నువ్వు ఫాంహౌజ్ విడిచి రానే రావు… మరి నీకెందుకు ఓటేయాలి. అందుకే చెబుతున్నా…. వచ్చే ఎన్నికల్లో నువ్వు అధికారంలోకి రావు.. రావు… రావు…రానేరావు….రాసిపెట్టుకో…’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు.

ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా రమేశ్ రాథోడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా జన్నారంలో ‘‘సింహగర్జన’’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. జై బీజేపీ…. జైజై బండి సంజయ్.. భారత మాతాకీ జై, హిందూ టైగర్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. సీఎం సీఎం అంటూ పదేపదే నినాదాలు చేస్తున్న కార్యకర్తలను బండి సంజయ్ వారించారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు బీసీని సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంతకుముందు ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.. ముఖ్యాంశాలు…

ఖానాపూర్ రమేశ్ రాథోడ్ కంచుకోట. రాథోడ్ గెలుపు పక్కా… బీఆర్ఎస్ నేతల ముఖాలు ఇక్కడ చెల్లడం లేదు. కాంగ్రెస్ కాసులకు అమ్ముడుపోయే పార్టీ. పొరపాటున రెండు పార్టీలు అధికారంలోకి వస్తే కొద్దిరోజుల్లోనే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో సీఎం సీటు కొట్లాట మొదలైతది. బీఆర్ఎస్ లో కేటీఆర్ సీఎం అయితే ఆ పార్టీలో ఎవరూ మిగలరు. రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగాలన్నా… పదేపదే ఎన్నికలు రాకుండా నివారించాలన్నా బీజేపీ అధికారం రావాల్సిన అవసరం ఉంది.

ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలియడంతో కేసీఆర్ దుష్టపన్నాగాలు పన్నుతున్నారు. కాంగ్రెసోళ్లకు పైసలిచ్చి గెలిపించుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ ఎన్ని చేసినా డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నరు.

వాస్తవాలు మాట్లాడుతుంటే కేసీఆర్ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. అమెరికాలో నెలకు కోటి రూపాయల జీతం తీసుకునేవాడట.. అమెరికాలో చిప్పలు కడిగేటోడికి కోటి రూపాయలు ఎవరిస్తారు? మీ అయ్య లేకుండా నిన్ను కుక్కలు కూడా దేఖవ్. నెలకు కోటి సంపాదించానని చెప్పి… అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న సంగతి ఎందుకు చెప్పడం లేదు? రాష్ట్రాన్ని లూటీ చేసి ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దొబ్బి తెలంగాణను అప్పులపాల్జేసిండు. పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర రూపాయల అప్పు చేసిండు..

కేసీఆర్ దుష్టపాలన పుణ్యమా అని జీతాలిచ్చే పరిస్థితి లేదు. నిన్న సీఎం అంటున్నడు.. గిరిజనేతరులకు పోడు పట్టాలిస్తాడట… సిగ్గుండాలే.. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలే ఇవ్వలేదు. కొత్తగా గిరిజనేతరులకు పట్టాలిస్తామని చెబుతూ గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య కొట్లాట పెట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడు.

అన్నా… మీ పక్షాన కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేసిన. లాఠీదెబ్బలు తిన్న. రక్తం చిందించిన. నాపై దాడి చేసినా భయపడలే. కేసులు పెట్టినా, జైలుకు పంపినా బెదరలే… మీ కోసం కొట్లాడితే నాపై ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 74 కేసులు పెట్టిర్రు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నరు. అయినా భయపడతనా? కాషాయ జెండా పట్టుకుని మీకోసం కొట్లాడుతూనే ఉంటా. పేదల రాజ్యం తీసుకొచ్చేదాకా పోరాడుతూనే ఉంటా. గడీల పాలనను బద్దలు కొట్టేదాకా పోరాడుతూనే ఉంటా. పోడు భూములకు పట్టాల కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ.

మై డియర్ కల్వకుంట్ల కమీషన్ రావు…. నువ్వు ఏం చేశావని బీఆర్ఎస్ కు ఓటేయాలి? కుంగిపోయిన కాళేశ్వరం చూద్దామంటే రావు… 317 G.O వల్ల చనిపోయిన ఉద్యోగ కుటుంబాల దగ్గరికి రావూ…. TSPSC వల్ల నష్టపోయిన విద్యార్థుల దగ్గరికి రావూ… ఉద్యోగుల సమస్యలపై చర్చలకు రావు…పోడు భూముల కోసం పోలీస్ దెబ్బలు తిన్న గిరిజనుల దగ్గరికి రావూ… అసలు నువ్వు ఫాంహౌజ్ విడిచి రానే రావు… అందుకే చెబుతున్నా…. వచ్చే ఎన్నికల్లో నువ్వు అధికారంలోకి రావు.. రావు… రావు…రాసిపెట్టుకో…

రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఫార్టీలు ఒక్కటే. మూడు పార్టీలు కుమ్కక్కై బీజేపీని దెబ్బతీసి అధికారంలోకి రావాలనుకుంటున్నయ్. నేను చెబుతున్నా… కాంగ్రెస్, ఎంఐఎం కు ఓట్లేస్తే బీఆర్ఎస్ కు పడ్డట్లే… గత నాలుగేళ్లుగా మీకోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరుతున్నా. ప్రజల్లో కాంగ్రెస్ లేనేలేదు. మీడియాలో ప్రచారం తప్ప కాంగ్రెస్ కు క్యాడర్ లేనేలేదు. పాతబస్తీలోకి సభ పెట్టాలంటే ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలంటూ ప్రగల్భాలు పలికిన ఒవైసీకి డేట్, టైం ఫిక్స్ చేసి సవాల్ విసిరిన. పోలీసులు అడ్డంకులు స్రుష్టించినా అధిగమించా. అన్ నోన్ నెంబర్ నుండి ఫోన్ చేసి భార్యాపిల్లలను చంపుతామని బెదిరించినా భయపడలే. గుండెపోటుతో చావు అంచుదాకా పోయి వచ్చినోడిని. ఆ బెదిరింపులకు భయపడతానా?

ఇక ఖానాపూర్ నియోజకవర్గం విషయానికొస్తే…. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచుతామన్న హామీ ఏమైంది? గేట్లు పనిచేస్తున్నయా? వర్షమొస్తే కడెం ప్రాజెక్టు గేట్లు మూసుకుపోతాయి. ఈ ప్రాంతమంతా ముంపుకు గురైతది. కేసీఆర్ నోట్ల మన్ను పోయ.. ఎందుకీ అబద్దాలు? విదేశాల నుండి వచ్చినాయనకు ఇక్కడ బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడం సిగ్గు చేటు. వేములవాడలో ఇట్లనే చేస్తే గెలిచిన తరువాత పత్తా లేకుండా పోయారు. ఇక్కడా అదే జరుగుతుంది.

సదర్మట్ ప్రాజెక్టును పూర్తి చేస్తే 20 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. అయినా పట్టించుకోరు. ఖానాపూర్‌లో ఇప్పటికీ డిగ్రీ కాలేజీ లేదు. పెంబి మండలానికైతే హైస్కూల్ కూడా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖానాపూర్ మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సౌకర్యంగా అప్‌గ్రేడ్ చేస్తానన్న హామీ గాలికొదిలేశారు.

విదేశాల నుండి వచ్చిన నాయకుడికి బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. ఖానాపూర్ సమస్యలపై కనీస అవగాహన లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది? కమీషన్ల ఎమ్మెల్యే అని సొంత పార్టీ నేతలు అంటున్నరు. అవినీతి కేసులో ఆమె అనుచరులు జైలుకు పోయారంటే ఏ స్థాయిలో అవినీతి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పెంబి మండలం పస్పుల బ్రిడ్జికి కేంద్రం 108 కోట్లను రిలీజ్ చేస్తే వాటిని సక్రమంగా ఉపయోగించుకోలేదు. గంగాపూర్ వంతెన నిర్మించిన ఏడాదిలోపే కూలిపోయింది. ఖానాపూర్ టౌన్ రోడ్డు పరిస్థితి ఏంది? 12 కి.మీల వరకు 4 లేన్ రోడ్డు చేస్తామన్నరు. మూడేళ్లయింది. ఎక్కడ చూసినా అంసంపూర్తిగానే ఉంది. చివరకు 4 లేన్లు చేతగాక 2 లేన్లుగా మార్చి కటింగ్ దశలోనే ఆపేశారు. కమీషన్లన్నీ దొబ్బేశారు.

ఖానాపూర్ లో 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంతకీ ఎంతమందికి ఇచ్చారో చేతులెత్తండి.. ఎంతమందికి దళిత బంధు వచ్చిందో? ఎంతమందికి గిరిజన బంధు వచ్చిందో? ఎంతమందికి బీసీ బంధు వచ్చిందో చెప్పాలి…

బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. రైతులకు ఫసల్ బీమా సాయం చేస్తాం. సదర్మట్ ప్రాజెక్టు ద్వారా రెండో పంటకు నీరందేలా చేస్తా. పస్పుల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచుతాం. రమేశ్ రాథోడ్ ను బీజేపీ అభ్యర్ధిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా…’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.