Leading News Portal in Telugu

Seediri Appalaraju: కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు.. మంత్రి అప్పలరాజు ఫైర్‌


Seediri Appalaraju: కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు.. మంత్రి అప్పలరాజు ఫైర్‌

Seediri Appalaraju: నాదెండ్ల మనోహర్, ధూళిపాళ నరేంద్ర కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి సిదిరి అప్పలరాజు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమూల్ గ్రాండ్ సక్సెస్.. జగనన్న పాలవెల్లువ కంటే ముందు పాల సేకరణ ధరలు ఏడాదికో, రెండేళ్ళకో పెంచేవారు.. అమూల్ సంస్థ గత మూడేళ్లలో 8 సార్లు పాల సేకరణ ధరలు పెంచిందన్నారు.. దీని వల్ల ప్రైవేటు డైరీలకు ధర పెంచక తప్పటం లేదు.. అందుకే పాలవెల్లువ పై నాదెండ్ల, ధూళిపాళ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 3 లక్షల 73 మహిళా రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోంది.. పాడి రైతులకు 4 వేల 900 కోట్లకు పైగా అదనపు లబ్ది చేకూరిందని వివరించారు.

జనసేన తెలంగాణలో ఒక పార్టీతో, ఏపీలో మరో పార్టీతో సహ జీవనం చేస్తోందని సెటైర్లు వేశారు అప్పలరాజు.. తెలంగాణ పార్టీ ఆఫీసు నుంచి ఒక ప్రెస్ నోట్, ఏపీ నుంచి మరో ప్రెస్ నోట్ వస్తుంది.. దీంతో నాదెండ్ల మనోహర్ కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడుతున్నారు.. చంద్రబాబు పెట్టిన ఆదరణ పథకం వల్ల బాగుపడిన ఒక కుటుంబాన్ని చూపించమని సవాల్ విసురుతున్నాను.. మనోహర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పశువుల కొనుగోలు కోసం ప్రభుత్వం డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వటం అనే విధానం లేదు.. బ్యాంకులతో ఒప్పందం చేసుకుని రుణాలు పొందుతారు.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా వచ్చిన డబ్బులతో లబ్దిదారులు వాళ్ళకు నచ్చిన విధంగా పెట్టుబడి పెట్టుకుంటారని వెల్లడించారు. జనసేనలో కాస్త ఆలోచించే ఏకైక వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని చాలా మంది అనుకుంటారు.. కానీ, చంద్రబాబు ఇచ్చిన నోట్స్ తో ఇలా మాట్లాడకండి అని సూచించారు మంత్రి సిదిరి అప్పలరాజు.