Leading News Portal in Telugu

HD Kumaraswamy: కర్ణాటక హమీలకే దిక్కులేదు, తెలంగాణలో ఏం చేస్తారు..? సిద్ధరామయ్యపై ఆగ్రహం..



Hd Kumaraswamy

HD Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాగ్ధానాలు చేస్తున్నారని సిద్దరామయ్యపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల ప్రచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాత్కాలిక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని, డూప్లికేట్ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అని విమర్శించారు. తెలంగాణ రైతులకు ఇప్పటికే 24 గంటల విద్యుత్ ఉంటుందని, అక్కడికి వెళ్లి 5 గంటల కరెంటు ఇస్తామని ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అని కుమారస్వామి అన్నారు. కర్ణాటకలో 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అయితే తెలంగాణలో రెండు లక్షల పోస్టులను భర్తీ చేస్తామని సిద్ధరామయ్య, డీకేలు హమీలు ఇచ్చారని కుమారస్వామి విమర్శించారు. 2013-18 వరకు సీఎంగా సిద్ధరామయ్య ఉన్నప్పటి నుంచి ఖాలీలు అలాగే ఉన్నాయని వెల్లడించారు.

Read Also: Siddipet: వృద్ధురాలి దారుణ హత్య.. నోట్లో యాసిడ్, గుడ్డలు కుక్కి మరీ..

ఇటీవల తన నియోజకవర్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేశానని.. ఒక తాలూకాలో 28 నుంచి 30 మంది వ్యవసాయ అధికారులు, సిబ్బంది అవసరమైతే.. కేవలం ముగ్గురు వ్యక్తులే ఉన్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్-ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే శక్తి పథకానికి సంబంధించి.. బస్సులు, సిబ్బంది కొరత తనను తలదించుకునేలా చేస్తుందని మాజీ సీఎం అన్నారు. తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు రూ. 4000 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇస్తోందని, కర్ణాటకలోని మహిళలకు కేవలం రూ.2000 ఇచ్చే గృహలక్ష్మీ పథకం గురించి మాట్లాడారు. కర్ణాటకలో విద్యుత్ రంగంలో తరుచూ లోడ్ షెడ్డింగ్ జరుగుతోందని తెలిపారు.