Leading News Portal in Telugu

Udupi Crime: ఆటోలో వచ్చి.. నలుగురిని హత్య చేసిన దుండగుడు!



Crime Kills

4 members of a family were stabbed to death in Udupi: కర్ణాటకలోని ఉడుపిలో దారుణం చోటుచేసుకుంది. నేజారు సమీపంలోని తృప్తినగరలో ఓ కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. పావుగంటలోనే అందరిని హతమార్చి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..

తృప్తినగరలో హసీనా (46) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. హసీనా భర్త విదేశాల్లో ఉంటుండగా.. ఆమె ఇక్కడే పిల్లలను చూసుకుంటోంది. ఆదివారం తెల్లవారుజామున తెల్లని మాస్కు ధరించి వచ్చిన వ్యక్తి.. ఇంటి ఆవరణలో నిలబడి ఉన్న హసీనాపై కత్తితో దాడి చేశాడు. ఆపై ఇంట్లోకి వెళ్లి అఫ్నాన్‌ (23), అయ్నాజ్‌ (21), ఆసిం (12)లను కత్తితో పొడిచి హత్య చేశాడు. హసీనా ఇంట్లో అరుపులు విన్న పొరుగింటి యువతి ఆసిమ్‌ పరుగెత్తుకు రాగా.. ఆమెపై కూడా నిందితుడు దాడి చేశాడు. ఆపై అతడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆసిమ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Also Read: IND vs NZ: భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్.. మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు! తెలుగు ప్రేక్షకులకు పండగే

పావుగంటలోనే హసీనా కుటుంబంను హత్య చేసిన దుండగుడు తాను వచ్చిన ఆటోలోనే పరారయ్యాడు. తృప్తినగర ఆటో స్టాండ్‌ వద్ద బైకు పెట్టిన నిందితుడు.. శ్యామ్‌ అనే వ్యక్తి ఆటోలో హసీనా ఇంటికి వచ్చాడు. హత్య తర్వాత ఆటోస్టాండ్‌కు వెళ్లి.. తన బైకుపై పరారయ్యాడు. నిందితునికి సుమారుగా 45 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది.