Gruha Lakshmi scheme: కర్ణాటకలో ‘చాముండేశ్వరీ దేవికి’ గృహలక్ష్మీ పథకం.. అమ్మవారికి ప్రతీ నెల రూ.2000

Gruha Lakshmi scheme: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు ఆ పార్టీ విజయానికి కారణమయ్యాయి. అందులో ఒక పథకమే ‘గృహలక్ష్మీ’. ఈ పథకం ద్వారా ఏపీఎల్/బీపీఎల్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబ మహిళకు రూ.2000 అందిస్తున్నారు. అయితే ఈ పథకం కింద చాముండేశ్వరి అమ్మవారికి ప్రతీ నెల రూ. 2 వేలు చెల్లించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర మీడియా సెల్ ఉపాధ్యక్షుడు దినేష్ గూలిగౌడ శుక్రవారం తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, మంత్రి డీకే శివకుమార్ ఈ ప్రతిపాదను అంగీకరించారని, ప్రతీ నెలా ఈ మొత్తాన్ని చాముండేశ్వరి ఆలయ ఖాతాలో జమచేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ని ఆదేశించారని ఎమ్మెల్సీ చెప్పారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 30న మైసూరులోని చాముండేశ్వరి దేవత ఆలయంలో మొదటి విడత గృహలక్ష్మీ పథకంలోని నిధులను జమచేసి పథకాన్ని ప్రారంభించింది. దీనిని అమ్మవారికి అంకితం చేస్తూ.. ఆర్థికంగా వెనబడిన వర్గాల మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ఈ పథకాన్ని విజయవంతం చేయాలని అమ్మవారిని ప్రార్థించారు.