posted on Nov 24, 2023 2:03PM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.
బిఆర్ఎస్ తొలి విడత జాబితాలో టిక్కెట్ సంపాదించిన ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఇవ్వాళ బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిట్టింగ్ అభ్యర్థుల్లో ఒక్క ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు మాత్రమ్ బీ ఫాం ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ వీడారు. పోలింగ్ కు కేవలం ఆరు రోజుల సమయం ఉన్నప్పుడు ఆయన పార్టీ మారడం చర్చనీయాంశమైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అబ్రహంను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను తొలుత ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయనను మార్చి ఆ స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఇచ్చారు. దీంతో, తీవ్ర అసంతృప్తికి గురైన అబ్రహం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు.
2009లో కాంగ్రెస్ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రసన్న కుమార్ పై అబ్రహం గెలిచారు. 2014లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు.