Leading News Portal in Telugu

Telangana Assembly Election 2023: పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు


Telangana Assembly Election 2023: పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు

Telangana Assembly Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది. వారిలో మహిళలు 221 మంది కాగా, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్‌ జెండర్‌. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418. మహిళా ఓటర్లు కోటి 63 లక్షల వెయ్యి 705మంది. ట్రాన్స్‌ జెండర్‌ ఓటర్ల సంఖ్య 2,676.

తెలంగాణలో మొత్తం సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944. అలాగే 18-19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 9 లక్షల 99 వేల 667. పోలింగ్ కేంద్రాల సంఖ్య 35 వేల 655. దివ్యాంగుల కోసం పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు 21 వేల 686 వీల్‌ఛైర్లు సిద్ధం చేశారు. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు వుంచుతున్నారు. ఇదే సమయంలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 120 పోలింగ్‌ కేంద్రాలను నిర్వహించేది కేవలం దివ్యాంగులే. అలాగే 597 పోలింగ్‌ కేంద్రాలను మహిళలే నిర్వహించబోతున్నారు.

ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్ వుంటుంది. అలాగే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. మిగతా 106 సెగ్మెంట్లలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ వుంటుంది. ఎన్నికల బందోబస్తులో 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలు, 50వేల మంది పోలీసులు వుంటారు. డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. ఇక, ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా రేపు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, విద్యాసంస్థలకు ఈ రోజు, రేపు సెలవు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న విద్యాశాఖ సిబ్బందికి బుధ, గురువారాల్లో సెలవుతోపాటు డిసెంబర్‌ 1వ తేదీన స్పెషల్‌ క్యాజువల్‌ లీవుగా ప్రకటించారు అధికారులు.