
Supreme Court: సాధారణంగా పురుషులే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటారు. అయితే మహిళపై అత్యాచార కేసు పెట్టవచ్చా..? అనేది ప్రశ్న. అయితే దీనిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ అత్యాచార కేసులో ఒక మహిళ పిటిషన్ వేయడంతో దీన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 61 ఏళ్ల మహిళపై ఆమె కోడలు పెట్టిన కేసులో స్పందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? లేదా..? అనే అంశాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సంజయ్ కరోల్లతో కూడిన ధర్మాసనం సిద్ధమైంది. మహిళను అరెస్టు నుంచి రక్షణ కల్పించి, విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించింది.
పంజాబ్కి చెందిన 61 ఏళ్ల మహిళ, గతేడాది సెప్టెంబర్ నెలలో పెద్ద కొడుకుకి ఓ యువతితో వివాహం జరిపించింది. ఆమె కొడుకు అమెరికాలో ఉండగా.. వర్చువల్గా పెళ్లి జరిపించింది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె కొడుకు స్వదేశానికి రాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత పోర్చుగల్ దేశంలో ఉండే చిన్న కొడుకు స్వదేశానికి వచ్చారు. కొన్ని రోజులు కుటుంబంతో ఉండీ మళ్లీ విదేశాలకు వెళ్లిపోయాడు.
అయితే కొన్నాళ్లకు కోడలు, అత్తా, ఆమె చిన్న కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. తన న్యూడ్ ఫోటోలు చూపించి, తనపై అత్యాచారం చేసినట్లు చెప్పింది. ఇందుకు తన అత్తగారు సహకరించారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కోడలు ఫిర్యాదులో అత్తా, చిన్న కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులఅో ముందస్తు బెయిల్ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ని కొట్లటేశారు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.