Leading News Portal in Telugu

Pakistan: ప్రధాని బాధ్యతలపై నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పీఎంగా అతడే..


Pakistan: ప్రధాని బాధ్యతలపై నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పీఎంగా అతడే..

nawaz sharif: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (PML-N) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ను ఆయన నామినేట్‌ చేశారు. దీంతో షహబాజ్‌ మరోసారి పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నాలుగోసారి పాక్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ పదవి బాధ్యతలు తీసుకుంటారని అందరు అనుకున్నారు.. కానీ, ఈ షాకింగ్‌ నిర్ణయం వెల్లడించారు.


కాగా, నవాజ్‌ షరీఫ్‌ షహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పీఎంఎల్‌-ఎన్‌ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తెలియజేశారు. అలాగే, నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌ ను పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. పీఎంఎల్‌-ఎన్‌ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సపోర్టు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్‌ ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్‌ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీతో చర్చలు చేశారు. ఈ క్రమంలో నవాజ్ షరీఫ్‌ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని అందరు అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయన తన తమ్ముడి పేరుని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో విజయం సాధించాగా.. పీఎంఎల్‌-ఎన్‌ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలిచింది.