Leading News Portal in Telugu

Farmers Protest: ఢిల్లీలో మూడో రోజు రైతుల ఆందోళన.. నేడు చర్చలకు పిలిచిన కేంద్రం!


Farmers Protest: ఢిల్లీలో మూడో రోజు రైతుల ఆందోళన.. నేడు చర్చలకు పిలిచిన కేంద్రం!

Shambhu border: తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ఇక, తమ ఆందోళన కొనసాగిస్తాం.. నేడు కూడా పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు.


అయితే, మంగళవారం నాడు ఢిల్లీకి చేరుకునేందుకు రైతులు ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పంజాబ్‌–హరియాణా శంభు సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతం చోటు చేసుకుంది. బుధవారం నాడు ఉదయం బారికేడ్లను ఛేదించుకొని, ఢిల్లీవైపు వెళ్లేందుకు ట్రై చేసిన రైతులపై పోలీసులు డ్రోన్లతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో శంభు బోర్డర్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టగా.. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే, శంభు బోర్డర్‌ దగ్గర పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు పతంగులు ఎగురవేశారు. ఇక, శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్లు ఉపయోగించడం వల్ల పంజాబ్‌ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక, రైతుల డిమాండ్లపై రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా పేర్కొన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించి, నిరసనను విరమించుకోవాలని రైతులకు సూచించారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగియడంతో.. నేడు మరోసారి చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్‌లో జరుగనున్నట్లు సమాచారం.