Leading News Portal in Telugu

Tummala Nageswara Rao: రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉంటాం..



Tummala

రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో.. గత ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి కారణంగా రాష్ట్రములో 75 శాతం సాగు విస్తీర్ణము రెండు, మూడు పంటల క్రిందకు వచ్చిందన్నారు. ఈ పరిస్థితిని నివారించి అన్నీ పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా అవసరమగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించిందని తెలిపారు. ఈ క్రమంలో పసుపు బోర్డు ఏర్పాటు, CII సెంటర్ల కొనసాగింపుకు కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.

ఇప్పుడు మార్కెట్లకు పోటెత్తుతున్న మిర్చి పంట అమ్మకాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కానీ, ధర విషయంలో తేడా కానీ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయిలో పనిచేసే సంబంధిత అధికారులను అమ్మకాలు ఎక్కువగా జరిగే మార్కెట్లకు పర్యవేక్షకులుగా నియమించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొనే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ సీజన్ లో రాష్ట్రంలో 3 లక్షల 91 వేల ఎకరాలలో మిర్చి సాగుచేయగా.. ఇప్పటికే 94395.08 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్ కు రావడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో 33,7014 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని.. కావున మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు ఎటువంటి నిర్లక్ష్యమునకు తావివ్వకుండా, అమ్మకాలు సజావుగా సాగేందుకు అన్నీ చర్యలు చేపట్టాలని తెలిపారు. లేనిచో కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు.

అధే విధంగా… వేరుశనగ అమ్మకాల్లో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సత్వరము పరిష్కరించి అమ్మకాలు సజావుగా సాగేటటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగుకాగా.. 1.92 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగలదని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు.. వ్యవసాయ, ఉద్యానశాఖల నుంచి కూడా అధికారులను సంబంధిత జిల్లా అధికారులతో మిర్చి మరియు వేరుశనగ అధికంగా పండించే జిల్లాలను సందర్శించి, రైతులందరికీ మార్కెట్లకు ఉత్పత్తులను తీసుకొచ్చే విషయములో అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.