Leading News Portal in Telugu

Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక..



Soniya

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 6 ఎంపీలు, బీజేపీకి 4 ఎంపీలు దక్కాయి.

Elections Schedule: మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్..!

2024 రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి తేదీ. ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఈ ముగ్గురూ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా.. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియాగాంధీ. గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1964లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Kamal Nath: కమల్‌నాథ్‌ వ్యవహారంపై వీడిన ఉత్కంఠ! కీలక భేటీలో ఇలా!

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో బీజేపీకి చెందిన ఎల్ మురుగన్, ఉమేష్ నాథ్ మహరాజ్, మాయా నరోలియా, బన్షీలాల్ గుర్జార్ పేర్లు ఉన్నాయి. అశోక్ సింగ్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాత్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.