Leading News Portal in Telugu

Jayalalitha: జయలలిత ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు



Jayalalita

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (Jayalalitha) బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు (Gold Jewellery) తీసుకువెళ్లాలని తమిళనాడు సర్కార్‌కు ఆదేశించింది.

ఇందు కోసం ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, ఇతర భద్రతా సిబ్బంది సమక్షంలో మార్చి 6, 7వ తేదీల్లో ఆభరణాలు తీసుకువెళ్లాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడు రాష్ట్రానికి ఆభరణాలు అప్పగించే ఉద్దేశంతో ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అక్రమ ఆస్తుల కేసులో 2014 సెప్టెంబరులో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ ఇచ్చిన తీర్పులో జయలలిత, ఎన్.శశికళ, జె.ఇళవరసి, విఎన్.సుధాకరన్‌లను దోషులుగా నిర్ధారించారు. వారందరికీ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జయలలితకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురికి రూ.10 కోట్ల చొప్పున జరిమానా వేశారు. మే 11, 2015న కర్ణాటక హైకోర్టు వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులను పునరుద్ధరించింది. అప్పటికే జయలలిత మరణించినందున, ఆమెపై ఉన్న అభియోగాలు తొలగిపోతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మిగితా ముగ్గురు మాత్రం నాలుగేళ్ల శిక్షను అనుభవించి జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.

ఇక జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను వేలం ద్వారా విక్రయించాలని తెలిపింది. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతూ జయలలిత మరణించారు. అప్పటి నుంచి కోర్టు కాగితాల్లోనే నలుగుతున్న ఈ కేసుపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ నగలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బంగారు ఆభరణాలను తీసుకోవడానికి ఓ అధికారిని కూడా ధర్మాసనం నియమించింది. మొత్తానికి జయలలిత ఆభరణాలు త్వరలో తమిళనాడుకు చేరనున్నాయి.