Rajya Sabha Elections: రాజ్యసభ పోల్స్లో క్రాస్ ఓటింగ్.. 3 రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా ప్రతిపక్షాల ఓటు.!

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏడుగురు సమాజ్వాదీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓటమి అంచున ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ పోటీలోకి మాజీ కాంగ్రెస్ నేత హర్ష్ మహాజన్ని బీజేపీ బరిలో నిలిపింది.
Read Also: Varun Tej: వార్ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ అందుకే : వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ
ఇక యూపీ విషయానికి వస్తే మొత్తం ఇక్కడ 10 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. బీజేపీకి 252 మంది ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షాలకు 18 మంది సభ్యులు ఉన్నారు. నిజానికి బీజేపీకి ఏడుగురిని గెలిపించుకునే బలం ఉన్నప్పటికీ..8 మందిని బరిలోకి దింపింది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ 3 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. అయితే, ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడటంతో అఖిలేష్ కుమార్కి భారీ దెబ్బ తగిలినట్లైంది.
ఇక కర్ణాటకలో బీజేపీ, మిత్రపక్ష జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) నాలుగు సీట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో తలపడుతోంది. ఈ రాష్ట్రంలో నాలుగు సీట్లు ఉంటే ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జేడీయూ నుంచి ఐదో అభ్యర్థి బరిలోకి దిగారు. కర్ణాటకలో కాంగ్రెస్కి 134 మంది, బీజేపీకి 66, జేడీఎస్కి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులను గెలిపించుకునే బలం ఉంది. ఐదో వ్యక్తిని రంగంలో దింపడంతో బీజేపీ గేమ్ ప్లే చేస్తోంది. దీంతో ప్రాధాన్యత ఓటింగ్ అమలులోకి వస్తోంది. ఇవి కాకుండా 41 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కొత్త ఎంపీల జాబితాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ బాస్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అశ్విణి వైష్ణవ్, ఎల్ మురుగన్, ఇటీవల బీజేపీలో చేరిన అశోక్ చవాన్ ఉన్నారు.