
Mumbai No 10 and No 11 Batters Scores Centuries in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్లో ముంబై టెయిలెండర్లు సంచలనం సృష్టించారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో తనుష్ కొటియన్ (120 నాటౌట్; 129 బంతుల్లో 10×4, 4×6), తుషార్ దేశ్పాండే (123; 129 బంతుల్లో 10×4, 8×6) సెంచరీలతో చెలగారు. 10వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన తనుశ్ శతకం చేయగా.. 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన తుషార్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 10, 11వ నంబర్ ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి మాత్రమే. 1946లో సర్రేతో జరిగిన ఫస్ట్క్లాస్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు చందు సర్వటే, షుటే బెనర్జీలు 10, 11 స్థానాల్లో బరిలోకి దిగి సెంచరీలు చేశారు.
తనుష్ కొటియన్, తుషార్ దేశ్పాండే శతకాలు చేయడంతో బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్ హార్దక్ తామోర్ (114) కూడా సెంచరీ బాదడంతో ముంబై రెండో ఇన్నింగ్స్లో 569 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ (36) ఆధిక్యాన్ని కలుపుకుని బరోడా ముందు 606 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా ఆట ముగిసే సమయానికి 121/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 36 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై సెమీస్ చేరింది.
Also Read: Shreyas Iyer-BCCI: బీసీసీఐ హెచ్చరిక.. దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్!
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో బరోడా 348 పరుగులు చేసింది. ఆట చివరి రోజు బరోడా 121/3తో నిలిచింది. ఈ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అయితే తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యం ఆధారంగా ముంబై సెమీస్కు చేరుకుంది. మరో క్వార్టర్స్లో విదర్భ 127 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించి సెమీస్ చేరింది.