Leading News Portal in Telugu

USA: అమెరికాలో మరో భారతీయుడు హత్య



Usa Murder

అగ్రరాజ్యంలో (America) భారతీయుల భద్రతపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇండియన్స్ లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అమెరికా ప్రభుత్వ పెద్దలు కూడా విచారం వ్యక్తం చేశారు. అయినా కూడా మారణహోమం మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రవాస భారతీయులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజ్‌సింగ్‌ అలియాస్‌ గోల్డీ (23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. అలబామాలోని సంగీత కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా (Gurdwara) బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజాసింగ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

రాజాసింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh Man) బిజ్నోర్ జిల్లా తండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజాసింగ్‌ తండ్రి మరణించాడు. కుటుంబమంతా రాజాసింగ్‌ సంపాదనపైనే ఆధారపడి ఉంది. రాజాసింగ్‌కు తల్లి, సోదరుడు, సోదరీమణులు ఉన్నారు. రాజాసింగ్‌ మృతదేహాన్ని భారత్‌ తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అతడి కుటుంబం కోరింది.

ఫిబ్రవరి 23న ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించాలని బాధిత కుటుంబీకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడాదిన్నరగా అక్కడే యూఎస్‌లోనే సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తన బృందంతో కీర్తనను ప్రదర్శించిన తర్వాత.. గురుద్వారా వెలుపల నిలబడి ఉన్నాడు. హఠాత్తుగా గుర్తు తెలియని దుండగులు అతనిని కాల్చి చంపారు.