
వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి సమస్యలు మొదలవుతుంటుంది. భూగర్భ జలాలు ఎండిపోవడం.. చెరువుల్లో, కాలువుల్లో నీరు అడుగంటిపోవడంతో తాగునీటి కష్టాలు మొదలవుతుంటాయి. ఇంకోవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో బెంగళూరు ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. నీరు వృథా చేస్తే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు హౌసింగ్ సొసైటీ నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు నగరంలోని యల్హంక, కనకపుర, వైట్ఫీల్ట్ ప్రాంతాల్లో నివసించే వారికి తాగునీటి సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. ఈ క్రమంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో నివసించే వారిలో ఎవరైనా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే.. వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా నగరంలోని ట్యాంకర్ల యజమానులు మార్చి 7 నాటికి తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.556 కోట్లు మంజూరుచేసినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరు నగరంలోని ప్రజల కోసం తమవంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఖాళీ పాల ట్యాంకులను నీటి నిల్వకు, సరఫరా కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు.