
ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు.. ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని, నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలే.. అని, మీకు విశ్వాసం కల్పించడానికే మీతో చర్చలు జరిపామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా..’దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తాం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్దం. విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ…తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారు.. శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారు.. తెలంగాణ బాపు అని తనకు తానే చెప్పుకుంటుండు.. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలి. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదు. తెలంగాణలో ఆదాయం పడిపోయింది… ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగింది. మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు వేసినా మేం ప్రచారం కల్పించుకోలేదు.. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం.. 11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసాం.
రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం..మూడు నెలలు ఉంటది.. ఆరు నెలలు ఉంటదని కొందరు మాట్లాడుతున్నారు… తమాషా అనుకుంటున్నారా? మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు.. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం… పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం… ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలి… 95శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారు. సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే… ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.. శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందే.. మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుంది.. సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోం. వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. గవర్నర్ తో మాట్లాడి కోదండరాం సార్ ను శాసన మండలికి పంపుతాం. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.