Leading News Portal in Telugu

Pemmasani: వైసీపీ నేతపై గుంటూరు జిల్లా ఎస్పీకి పెమ్మసాని ఫిర్యాదు..



Pemmasani

మా అభ్యర్థిపై దాడి చేసి మా పైనే కేసులు పెడుతున్నారు అని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ పెమ్మసాని తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుపై బుధవారం నాడు జరిగిన వైసీపీ నాయకుల దాడిని ఆయన ఖండించారు. ఇక, పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీని ఆయన కార్యాలయంలో గురువారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి సమస్యను వివరించిన తర్వాత ఎన్నికల నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు.

Read Also: RC16: శ్రీదేవి కనుక బతికి ఉంటే.. ఈ వేడుక మరో లెవెల్లో ఉండేది మావా

కాగా, విలేకరుల సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎస్పీ, కలెక్టర్ ను కలిసి ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన వైఖరిని అవలంబించాలని కోరాం.. అధికార పార్టీ నాయకులు ఇదే తీరున దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.. తమదైన పద్ధతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులను ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకులు టీడీపీ నేత వాహనంపై దాడి చేసిన ఆధారాలు చూపిస్తున్నా సరే అధికారులు స్పందించకపోవడం ఏంటని పెమ్మసాని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Read Also: Vivo T3 5G Launch: వివో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర, స్పెసిఫికేషన్స్‌ ఇవే!

అధికార పార్టీ నాయకులు వైసీపీ కార్యాలయంలో సమావేశాలు పెట్టి మరీ డబ్బులు, బహుమతులు ఇచ్చే విధంగా సిద్ధపడుతున్నారు.. ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేత రామాంజనేయులు ఆరోపించారు. వైసీపీ నాయకులు ఏం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.. తమపై దాడులకు తెగబడి వాహనాలు ధ్వంసం చేసిన నాయకులపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమన్నారు. చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా తమకు రక్షణ లేని విధంగా పోలీసుల ముందరే వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారని ఆయన స్పష్టం చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. లేని పక్షంలో తాము టీడీపీ అదిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తాడికొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.