
మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారన్నారు. 2,964 బూత్ లలో ప్రతీ బూత్ లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని, నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందని, వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం.. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది.. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంఖుస్థాపన చేసునుకున్నాం.. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా.. కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి. తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్లు గెలిచినా మల్కాజిగిరి పార్లమెంట్ లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది.. అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి… అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది.. పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలి.. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి. వారికి పోలింగ్ బూత్ ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి. రేపు సాయంత్రం కంటోన్మెంట్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలి. ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందే.. ప్రణాళికబద్దంగా ప్రచారం నిర్వహించుకోవాలి.. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు… ముఖ్యమంత్రిది.. నా బలం.. నా బలగం మీరే… ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే..’ అని ఆయన వ్యాఖ్యానించారు.