Leading News Portal in Telugu

Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట..



Kishanreddy

సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్లు కూడా ప్రారంభమైనాయన్నారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు 7ఫేస్ లలో జరుగుతున్నాయని, మన తెలంగాణలో 4వ ఫేస్ లో మే 13న ఎన్నికలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసాకే టిఫిన్ చేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. పోలింగ్‌ రోజు ఉదయం లేవగానే ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో 40శాతం కూడా పోలింగ్ జరగడం లేదని, ప్రజలకు సౌకర్యాలు లేవని ప్రతీ ఒక్కరు విమర్శిస్తరు. ప్రతీ ఒక్కరికి విమర్శించడానికి ఎంత హక్కు ఉందో ఓటు వేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు.

 

ఐదేండ్లకు ఒక్కసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు కుటుంబ సభ్యులతో చర్చించి వేయాలని, దేశం కోసం జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే దేశం భద్రంగా ఉంటదో, దేశ గౌరవం పెరుగుతుందో, మన పిల్లల భవిష్యత్తు బాగుంటదో ఆలోచించి వేయాలన్నారు. కాంగ్రెస్ హాయాంలో దేశంలో, హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ ఉగ్రవాదాలు తోకలు కోసాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచి వేసిందని, ఇది మోడీ భారతం, కొత్త భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పినమన్నారు.

ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని ఆపి ఆ దేశాల్లో చిక్కుకున్న 25వేల భారతీయులను స్వదేశానికి నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా పని చేస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం కారణంగా 46వేల మంది చనిపోయిన జమ్మూ కాశ్మీర్ లో మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిందని, యూపీఏ పాలనలతో దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీయాలని ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దేశంలో నేడు తినడానికి తిండి దొరకడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ని ఏకాకిని చేశారని, కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా ఉన్న కనిమొళి, రాజా 2జీ స్పెక్ట్రంలో అవినీతి చేసి జైలు కు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో రూపాయి అవినీతి జరగలేదని, ధర్మబద్ధంగా, నీతి, నిజాయితీగా మోడీ పని చేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో దేశం ఎలా ఉందో, మోడీ హయాంలో దేశం ఎలా ఉందో తేడా చూసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అని కిషన్‌ రెడ్డి అన్నారు.