Leading News Portal in Telugu

INDIA Bloc: కూటమిలో మరో చీలిక.. అభ్యర్థుల్ని ప్రకటించేసిన ఆర్జేడీ



Rjd

ఇండియా కూటమిలో మరో చీలిక వచ్చేటట్టు కనిపిస్తోంది. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క ఇంకా తేలలేదు. కానీ సంకీర్ణ ధర్మాన్ని మాత్రం రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది. ఏకపక్షంగా 13 చోట్ల ఆర్జేడీ అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ తొలి విడతలో ఉన్న 4 నాలుగు స్థానాలు ఇందులో ఉన్నాయి. ఆర్జేడీ ఏకపక్షంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం రుచించడం లేదు.

సివాన్, కతిహార్, మధుబని నియోజకవర్గాలకు ఆర్జేడీ అభ్యర్థులను వెల్లడించింది. ఈ మూడు సీట్లను సీపీఎం ఎంఎల్ కూడా ఆశిస్తోంది. కతిహార్ స్థానం కోసం కాంగ్రెస్, సీపీఎం ఎంఎల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మధుబని సీటు కోసం ఆర్డేజీ, సీపీఐ, సీపీఎం పోటీ పడుతున్నాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం చర్చలు జరుపుతుండగా ఆర్జేడీ అధినేత 13 మంది అభ్యర్థులను ప్రకటించారు. ముస్లిం, యాదవ్, కుష్వాహా ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ప్రకటించారు.

ఆర్జేడీ అభ్యర్థులు వీరే..
బంకా- జై ప్రకాశ్ యాదవ్, సరన్- రోహిణి ఆచార్య, ఉజియార్పూర్- అలోక్ మెహతా, పట్లిపుత్ర-మీసా భారతి, బక్సర్- సుధాకర్ సింగ్, జెహనాబాద్- సురేంద్ర యాదవ్, ముంగర్- అనిత్ మహతో, మధుబని- అష్రఫ్ అలి ఫాత్మీ, వైశాలి- రామా సింగ్‌తో 13 నియోజకవర్గాలకు ఆర్జేడీ అభ్యర్థులను ప్రకటించింది.

మరోవైపు సీపీఎం ఎంఎల్, సీపీఐ, సీపీఎం కూడా మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అరాకు సుదామ ప్రసాద్, అవదేష్‌- రాయ్ బెగుసరాయ్, ఖగారియాకు సంజయ్ కుష్వాహాను ప్రకటించాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నామని.. కాంగ్రెస్‌కు సీట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకో వైపు అభ్యర్థులను ప్రకటించేసింది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

బీహార్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో కూడా ఇటీవల సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. బీజేపీకి 17, జేడీయూకి 16, మిగతా స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించారు. ఈసారి బీజేపీనే ఒక సీటు ఎక్కువ తీసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.