
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ లో సోనియాగాంధీ, రాహుల్తో పాటు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. ఇక, 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ తీసుకుంటుంది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థిత్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపించనుంది.
Read Also: Astrology: మార్చి 27, బుధవారం దినఫలాలు
అయితే, ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు ఏఐసీసీకి సిఫారసు చేశారు. కాగా, సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ.. ఇక, బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్కుమార్ పోటీలో ఉండటంతో మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచనలు చేసినట్లు తెలుస్తుంది. దీంతో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తీసుకెళ్లినట్లు టాక్. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఇతర రాష్ట్ర నేతలను కలిసిన మల్లన్న కరీంనగర్ నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక, ఆయన పేరును సీఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
Read Also: Lunch Bell: మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి ‘లంచ్ బాక్స్’.. డ్వాక్రా మహిళల విజయపధం..!
అలాగే, నిజామాబాద్ నుంచి తొలుత సునీల్రెడ్డి, దిల్రాజు పేర్లు పరిశీలించినప్పటికి చివరకు టి.జీవన్రెడ్డి వైపే సీఈసీ మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక, మెదక్ నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకే ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే, భువనగిరి స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కనబడుతుంది. ఇక్కడి నుంచి సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిలు కొన్ని పేర్లను ప్రతిపాదించగా.. సీఎం రేవంత్ మాత్రం చామల కిరణ్ కుమార్రెడ్డి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
Read Also: SRH vs MI: ముంబైతో సన్రైజర్స్ ఢీ.. ఉప్పల్లో బోణీ కొట్టేదెవరో!
ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరు పేర్లను పరిగణనలోకి తీసుకుని విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేయనుంది. ఇవాళ లేదా రేపు జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, గాంధీభవన్ వేదికగా ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకాబోతున్నారు. ఈ మీటింగ్ ఎజెండాపై చర్చించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ సీఎం రేవంత్రెడ్డితో నిన్న (మంగళవారం) భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు.