Leading News Portal in Telugu

Taj Mahal: తాజ్ మహల్‌ని శివాలయంగా ప్రకటించాలి.. విచారణకు స్వీకరించిన కోర్టు..



Taj Mahal

Taj Mahal: ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్‌లో మధుర శ్రీకృష్ణ జన్మస్థలం, జ్ఞానవాపి వివాదాలు కోర్టుల్లో నడుస్తున్న తరుణంలో మరో కేసు కోర్టుకు చేరింది. తాజ్ మహల్‌ని తేజో మహాలయ, శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో..అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపేయాలని, ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతుల్ని నిలిపేయాలని కోరింది. ఈ అంశంపై శ్రీ భగవాన్ శ్రీ తేజో మహాదేవ్ పోషకుడు, యోగేశ్వర్ శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ మరియు క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడైన న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దావా వేశారు.

Read Also: Savitri Jindal: కాంగ్రెస్‌కి మరో షాక్.. బీజేపీలో చేరిన సావిత్రి జిందాల్..

ఈ కేసును ఏప్రిల్ 9న విచారించేందుకు ఆగ్రా కోర్టు సిద్ధమైంది. తాజ్ మహల్‌ కన్నా ముందు ఇక్కడ తేజో మహాలయ శివాలయం ఉందని పలు హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. శివాలయంగా ప్రకటించాలని ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లను కొట్టివేయగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. తాజా పిటిషన్‌లో తాజ్ మహల్ ఇక్కడ గుర్తించకముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందన్న పిటిషనర్, తన వాదనకు మద్దతుగా పలు చారిత్రక పుస్తకాలను ఉదహరించారు.