Leading News Portal in Telugu

Kerala: వయనాడ్లో రాహుల్‌ గాంధీ ప్రత్యర్థిపై 242 క్రిమినల్ కేసులు..



Kerala

కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌ గాంధీపై పోటీ చేస్తున్న కే సురేంద్రన్‌పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తనపై ఉన్న కేసులను సురేంద్రన్ పత్రికా ప్రకటన ద్వారా తాజాగా తెలియజేశారు. సురేంద్రన్‌తో పాటు ఎర్నాకుళం నుంచి పోటీ చేస్తున్న మరో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కేఎస్ రాధాక్రిష్ణన్‌ పైనా కూడా 211 కేసులు ఉన్నట్టు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, వీరిపై నమోదైన కేసుల్లో ఎక్కువగా 2018లో చేపట్టిన శబరిమల నిరసనలకు సంబంధించినవే ఉన్నాయి.

Read Also: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..!

ఇక, ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ లీడర్లు సమ్మె లేదా ఆందోళనలకు పిలుపునిచ్చినప్పుడు.. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ కేసులు అలా నమోదు అయినవే అని కేరళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్ కురియన్ తెలిపారు. ఇదే అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం ట్విట్టర్ (‘ఎక్స్’) వేదికగా చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టం అన్నారు. అలా ఉండటం రోజు వారీ పోరాటంతో సమానం అని చెప్పుకొచ్చారు. కానీ, ఆ పోరాటం ఎంతో విలువైంది.. ఒక్క వ్యక్తి.. వందలాది కేసులు అంటూ పేర్కొంటూ సురేంద్రన్‌ను బీఎల్ సంతోష్ ట్యాగ్ చేశారు.