Leading News Portal in Telugu

CS Shanti Kumari: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం..



Cs Shanthi Kumari

CS Shanti Kumari: రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, డా. సుఖ్ బీర్ సింగ్ సంధులతో కలసి నేడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, డీజీపీ రవీ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Read Also: Jupalli Krishna Rao: మాజీ సీఎం కేసీఆర్‌పై జూపల్లి ఫైర్

రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివరించారు. రాష్ట్రంలో మొత్తం మీద శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, భూపాల పల్లి, ములుగు జిల్లాలపై, పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్‌తో సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు, తెలంగాణకు 860 కిలోమీటర్ల నాలుగు రాష్ట్రాల సరిహద్దు ఉందని, 154 చెక్ పోస్టులు తెరిచామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా శాఖలు సరిహద్దు రాష్ట్రాలతో కోఆర్డినేషన్ సమావేశాలను నిర్వహించాయని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రూ.69.66 కోట్లను స్వాధీన పర్చుకున్నామని, వీటిలో రూ. 27.38 కోట్ల నగదు, 10 కోట్ల విలువైన మద్యం, రూ.16 .14 కోట్ల విలువైన డ్రగ్స్, నార్కోటిక్స్ స్వాధీన పర్చుకోగా, రూ. 7 .49 కోట్ల విలువైన మెటల్స్‌ను స్వాధీన పర్చుకున్నామని వివరించారు. రాష్ట్రానికి 60 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు వచ్చాయని, మరో 100 కంపెనీల బలగాలు త్వరలోనే రానున్నాయని వివరించారు. మార్చి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు 6022 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలియజేశారు.