Leading News Portal in Telugu

KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్‌ నోటీసులు



Ktr Legal Notices

KTR: పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. వీరితోపాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్‌కు మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే తేల్చిచెప్పారు.

Read Also: Kodanda Reddy: పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ను బదనాం చేస్తున్నారు..

ఫోన్‌ ట్యాపింగ్ అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా. పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే తేల్చి చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నా సురేఖ.. లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని, అందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పని సరిగా శిక్షకు అర్హులేనని చెప్పారు. కేటీఆర్ భయంతో ఏదేదో దిగజారి మాట్లాడుతున్నారని సురేఖ మండిపడ్డారు.