Leading News Portal in Telugu

TS TET : రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు



Ts Tet

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు రేపటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు రేపటితో.. అంటే ఏప్రిల్‌ 10వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్‌టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. టెట్‌ అర్హత ఉన్నవారికే రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. పేపర్‌ 1 పరీక్షకు డీఈడీ అర్హతతోపాటు ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకైతే 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2015లోపు డీఈడీ పూర్తి చేసినవారు జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలి. జూన్‌ 12వ తేదీన టెట్‌ ఫలితాలు విడుదలవుతాయి.