Leading News Portal in Telugu

Ugadi 2024: చంద్రబాబుకు అధికార యోగం.. త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు..



Ugadi 2024 Tdp

Ugadi 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని అధికార, విపక్షాలు తమతమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు.. పంచాంగ శ్రవణం నిర్వహించాయి.. ఇక, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ఉగాది పచ్చడి అందించి ఆశీర్వదించారు వేద పండితులు. అనంతరం పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్.. పంచాంగ శ్రవణం చేస్తూ.. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. పొత్తులతో ఏం జరగబోతోంది లాంటి విషయాలను కూడా వెల్లడించారు..

Read Also: Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!

పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన పంచాంగ శ్రవణంలో చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందని తెలిపారు.. చంద్రబాబుకు అధికార యోగం ఉందన్న ఆయన.. త్రిమూర్తులు కలయికతో ఆంధ్రప్రదేశ్‌కి మేలు జరుగుతోందన్నారు.. బ్రహ్మ – నరేంద్ర మోడీ, విష్ణువు – పవన్ కల్యాణ్‌, ఈశ్వరుడు – చంద్రబాబు.. ఇలా త్రిమూర్తులుగా అభివర్ణించారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ సెగ్మెంట్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించనున్నట్టు పేర్కొన్నారు.. చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణం చేపడతారని తెలిపారు. టీడీపీది వృశ్చిక రాశి.. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారని వెల్లడించారు మాచిరాజు వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు.. వర్ల రామయ్య తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.