Leading News Portal in Telugu

Tummala Nageswara Rao : మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల పాత్రని ఏ మాత్రం ఉపేక్షించం


Tummala Nageswara Rao : మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల పాత్రని ఏ మాత్రం ఉపేక్షించం

రైతు సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆగస్టు 15 కల్లా, రైతు రుణమాఫీ అమలుచేసి తీరుతామని ఇప్పటికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు, మేము ప్రకటించిన విషయం విదితమే. తిరిగి రైతు ఈ అప్పుల ఊబిలో పడిపోకుండా మా ప్రభుత్వము రైతాంగ సంక్షేమం కోసం ఇతర పథకాల అమలుకు ప్రణాళిక చేస్తుందన్నారు. ముఖ్యంగా పంటనష్టపోయిన సందర్భాలలో రైతులను ఆదుకునే విధంగా పంటభీమా, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఈ వానాకాలం నుండి అమలు చేస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న, సన్నకారు రైతులు ప్రభుత్వరంగ బ్యాంకుల నుండి ప్రతి ఒక్కరికి రుణసహాయం అందేలా, వడ్డీవ్యాపారస్థులపై ఆధారపడకుండా చేసేందుకు పటిష్ట ప్రణాళికలను రూపోందిస్తున్నామని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, సకాలంలో ఎరువులు అందేలా చేస్తాము. కేంద్రప్రభుత్వం కొన్నా, కొనకపోయినా ప్రతిపంటను రైతుకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు.


అంతేకాకుండా.. ‘తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉండి, రైతులకు అధిక ఆదాయము సమకూర్చే పంటల ఎంపిక దిశగా రైతులను ప్రొత్సహిస్తాము. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత యూనివర్సిటిలకు, శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్రప్రభుత్వం గడిచిన పదేళ్ళ కాలంలో రైతుల నికరఆదాయాన్ని పెంచే ఏ ఒక్క పథకాన్ని తీసుకురాలేకపోయింది. కనీసం రైతు రుణమాఫీ చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కనీస తోడ్పాటు అందిస్తామన్న చిన్న ప్రకటన కూడా చేయడానికి బిజెపి పెద్దలు సంశయిస్తున్నారంటే, రైతాంగ సంక్షేమం పట్ల వాళ్ళకి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది. వారికి పెట్టుబడిదారుల, సంపన్నుల రుణాలు మాఫీ చేయడంలో ఉన్న ప్రత్యేక శ్రద్ధ, పేద రైతాంగం పట్ల లేదు.

మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన, తెలంగాణ రాష్ట్రంను, తమ అసమర్ధ విధానలతో, అప్పుల ఊబిలోకి నెట్టిన, ఆర్థిక వ్యవస్థను దివాళాతీయించిన BRS నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం. ప్రత్యేక ఆర్థిక క్రమశిక్షణతో, ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వానికి మీలాగా కల్లబొల్లి కబుర్లు, ఎన్నికలకోసమే కొన్ని ప్రాంతాలకే పథకాలు అమలు చేయడం వంటివి తెలియవు. తెలంగాణ ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు అని వ్యాఖ్యానించడంలోనే తెలస్తుంది BRS పెద్దలకు తెలంగాణ ప్రజల పట్ల వారి తీర్పు పట్ల ఎంత చులకనభావం ఉందో. వారికి అధికార మత్తు ఇంకా వదల్లేదని, దానిని పూర్తిగా ఈ లోక్ సభ ఎన్నికల్లో వదలగొట్టడానికి అదేవిధంగా రైతాంగ సమస్యల పట్ల బిజెపి వాళ్ళ ఉదాసీన వైఖరిని ఎండగట్టె విధంగా తీర్పు ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు సిద్ధంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.