Leading News Portal in Telugu

Ministry of Finance: విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అవసరమా..?


  • ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అని గత కొద్ది రోజులుగా వార్తలు
  • ప్రభుత్వం బడ్జెట్‌లో నిబంధన పెట్టినట్లు పుకార్లు
  • పుకార్లను కొట్టిపారేసిన ప్రభుత్వం
  • విదేశాలకు వెళ్లేందుకు టీసీసీ తప్పనిసరి కాదని స్పష్టం
Ministry of Finance: విదేశాలకు వెళ్లాలంటే  ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అవసరమా..?

విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇకపై విదేశాలకు వెళ్లేందుకు ఈ సర్టిఫికెట్ తప్పనిసరని ప్రభుత్వం బడ్జెట్‌లో నిబంధన పెట్టినట్లు చెబుతున్నారు. దీనిపై చాలా మంది రకరకాలుగా స్పందించారు. వీటన్నింటి మధ్య ఇప్పుడు ఈ సర్టిఫికెట్‌కు సంబంధించి ప్రభుత్వ ప్రకటన వచ్చింది. భారతీయ పౌరులందరూ విదేశాలకు వెళ్లేందుకు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి కాదని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ (టీసీసీ) తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

READ MORE: Delhi Court: వ్యక్తిపై నకిలీ అత్యాచార కేసు పెట్టిన మహిళ.. కోర్టు ఏం చెప్పిదంటే..?

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 230 ప్రకారం ఈ స్పష్టత ఇవ్వబడింది. జులై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన 2024-25 బడ్జెట్‌లో, నల్లధనం చట్టం, 2015ని పేర్కొంటూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను పొందాలనే ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన తర్వాత.. విదేశాలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీసీసీ తీసుకోవాలనే పుకారు వ్యాపించింది. అయితే ఈ ప్రతిపాదన కేవలం నల్లధనం చట్టానికి సంబంధించిన కేసులకు మాత్రమేనని, అందరికీ కాదని సీబీడీటీ(CBDT) స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 230 ప్రకారం.. ప్రతి వ్యక్తి పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదని సీబీడీటీ పేర్కొంది.

READ MORE:Narayana Murthy: చైనాతో భారత్ పోటీ పడలేదు..!ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సంచలన వ్యాఖ్యలు..

ఎవరికి అవసరం అవుతుంది?
తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్న వ్యక్తులకు మాత్రమే టీసీసీ అవసరమని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆదాయపు పన్ను చట్టం లేదా సంపద పన్ను చట్టం కింద విచారణకు హాజరు కావాల్సిన వారికి కూడా తప్పనిసరని తెలిపింది. వీరితో పాటు రూ.10 లక్షలకు మించి పన్ను చెల్లించని, ఏ అధికారి వద్ద కేసు పెండింగ్‌లో లేని వ్యక్తులు కూడా టీసీసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమీషనర్ నుండి అనుమతి పొంది. దానికి గల కారణాలను నమోదు చేసి, అనుమతి పొందినట్లయితే మాత్రమే టీసీసీని ఏ వ్యక్తి నుంచి అయినా కోరవచ్చని సీబీడీటీ స్పష్టం చేసింది.