- వైద్యుల నిరసనల్లో పాల్గొన్న క్రికెట్ లెజెండ్ గంగూలీ దంపతులు
-
బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్

కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది. ఇప్పటికే వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులైతే ఏకంగా ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొని న్యాయం కోసం గొంతెత్తారు. బుధవారం వైద్యుల చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని.. వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడారు.. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ త్వరితగతిని దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈ మధ్య ఇలాంటి కేసులు భయంకరంగా జరుగుతున్నాయని వాపోయారు. బాధితురాలికి న్యాయం జరగాలి.. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో గంగూలీతో పాటు భార్య డోనా గంగూలీ కూడా వెంట నడిచారు.
ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆమె కళ్లు, ప్రైవేటు భాగాల నుంచి విపరీతంగా రక్తస్రావం జరిగింది. అంతేకాదు.. శరీరమంతా గాయాలతో నిండిపోయింది. ఇక పోస్టుమార్టం రిపోర్టులో అయితే ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఆమెపై గ్యాంగ్రేప్ జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత రౌడీలు, గూండాలు ఆస్పత్రిలోకి వెళ్లి ఆధారాలు చెరిపేశారు. కోల్కతా హైకోర్టు జోక్యంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లోతుగా విచారిస్తోంది. ప్రధానంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోస్ను లోతుగా విచారిస్తున్నారు. ఇతడు భయంకరంగా మాఫియాను నడిపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.