- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
- కుడి..ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి

Srisailam Project: కృష్ణా బేసిన్ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తుండగా.. అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్కు వదిలేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఘాట్రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.
శ్రీశైలం జలాశయానికి 1,37,849 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 69,132 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా.. ప్రస్తుతం 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ఇలాగే కొనసాగితే శ్రీశైలం జలాశయ గేట్లు మరోసారి ఎత్తే అవకాశం ఉంది. మళ్లీ శ్రీశైలం గేట్లు ఎప్పుడు ఎత్తుతారోనని పర్యాటక ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.