Leading News Portal in Telugu

Home Minister Anitha: ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు..


Home Minister Anitha: ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు..

Home Minister Anitha: పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు ,ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని.. ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తం అయిందన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయన్నారు. క్షతగాత్రులను తక్షణమే హాస్పటల్స్‌కు తరలించామని మంత్రి తెలిపారు.

ప్రమాదం రోజు విజయవాడ నుంచి తాను రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి రాత్రి 12 ;30 కు చేరుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షతగాత్రులను పరామర్శించారని చెప్పారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారని.. తక్షణమే అధికారులతో సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. సీఎం ప్రకటించిన 24 గంటలు గడవక ముందే ఎక్స్‌గ్రేషియా అందజేశామన్నారు. జగన్ ధర్నా చేయాలంటే చాలా ఉన్నాయన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడకు పిలిపించుకున్నారని.. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారా అంటూ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్‌లో 15 మంది మృతి చెందితే, 12 మందికే ఎక్స్ గ్రేషియా ఇచ్చారని విమర్శించారు. ముగ్గురికి ఇప్పటికి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని ఆరోపించారు.