- సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన
-
రేషన్ కార్డు.. హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ -
పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు -
క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ఆదేశించిన సీఎం.

సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి… ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి.. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా… రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా…? వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం అన్నారు.