- ఏపీలో రెండు.. తెలంగాణలో ఒక పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
-
ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం -
ఏపీలోని కడప.. కర్నూలులో పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటు -
తెలంగాణలోని జహీరాబాద్ లో పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు.

ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ సిటీస్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అందులో ఏపీకి రెండు.. తెలంగాణకు ఒక “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో కర్నూల్ ఎయిర్ పోర్ట్కు 12 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు వద్ద “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 2621 ఎకరాల్లో.. 2,786 కోట్ల రూపాయలతో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఇది ఏర్పాటైతే 45,071 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు.. కడపలోని కొప్పర్తి వద్ద మరో “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” ఏర్పాటు చేయనున్నారు. 2596 ఎకరాల్లో.. 2137 కోట్ల రూపాయలతో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కానుంది. మొత్తం 54,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఇటు.. తెలంగాణలో ఒక “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని జహీరాబాద్ పట్టణం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” చేయబోతుంది. ఇది మొత్తం.. 3245 ఎకరాల్లో, 2361 కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఈ “పారిశ్రామిక స్మార్ట్ సిటీ” ఏర్పాటైతే, లక్ష 74 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.