- పార్టీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
టీడీపీలోకి ఎవరొచ్చినా.. రాజీనామా చేసే రావాలి- సీఎం -
నేతల వ్యక్తిత్వం ఆధారంగా పార్టీలో చేర్చుకునేది లేనిది.. నిర్ణయిస్తాం- సీఎం -
అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతాం- రామ్మోహన్ నాయుడు -
ఊసరవెల్లి లాంటి నాయకుల్ని టీడీపీలోకి తీసుకోవద్దు- గౌతు శిరీష.

పార్టీలో చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి ఎవరొచ్చినా.. రాజీనామా చేసే రావాలని తెలిపారు. నేతల వ్యక్తిత్వం ఆధారంగా పార్టీలో చేర్చుకునేది లేనిది.. నిర్ణయిస్తామని సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పార్టీలో చేరికలపై స్పందించారు. అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని అన్నారు. అయితే పార్టీలోకి వచ్చే వారు రాజీనామా చేసి వస్తారని ఆయన తేల్చి చెప్పారు. రాజ్యసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదని.. అసెంబ్లీలో తమ పార్టీకి సంఖ్యాబలం ఉందని.. దాంతో రాజ్యసభలో ఏర్పడే ప్రతీ ఖాళీ తమకే దక్కుంతుందని వెల్లడించారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా పై పలాస తెలుగుదేశం ఎమ్మెల్యే గౌతు శిరీష కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీడీపీ పార్టీ పెద్దలకు మనవి. దయచేసి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే.. అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే’. అని పేర్కొన్నారు. కాగా.. ఈరోజు పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. తన రాజీనామా లేఖను కూడా జగన్కు పంపారు. కాగా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సునీత తెలిపిన విషయం తెలిసిందే..