- దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేరంటూ కేంద్రమంత్రి ఆగ్రహం..
-
భారత్ పరువు తీసేందుకే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేస్తారు.. -
రాహుల్ లాంటి వారు ఎన్నో జన్మలు ఎత్తిన ఆర్ఎస్ఎస్ విధానాలను అర్థం చేసుకోలేరు: గిరిరాజ్ సింగ్

RSS: ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్సాస్లోని యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ.. ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. అయితే, రాహుల్ కామెంట్స్ పై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు ఆయనకీ ముందు నుంచే ఉందంటూ మండిపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేరని సీరియస్ అయ్యారు. భారత్ పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తారని అన్నారు.
ఇక, ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తోందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విదేశాలకు వెళ్లి దేశాన్ని విమర్శించే వారికి ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి తెలుసుకునే అవకాశం లేదు.. రాహుల్ ఎప్పటికీ ఆ వ్యవస్థ విధానాలను అర్థం చేసుకోరు.. ఆర్ఎస్ఎస్ భారతదేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందన్నారు. కాగా, అంతకముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ అంటే ఒకే ఆలోచన, భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది, మహిళలు కేవలం ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై వ్యతిరేక పోరాటం స్పష్టంగా కనిపించిందని రాహుల్ గాంధీ విమర్శించారు.