Leading News Portal in Telugu

Action on VRO: వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో తీరుపై ప్రభుత్వం సీరియస్


  • వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వోపై కలెక్టర్‌ సీరియస్
  • షోకాజ్ నోటీసు జారీ
  • రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
Action on VRO: వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో తీరుపై ప్రభుత్వం సీరియస్

Action on VRO: విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్‌లో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వో జయలక్ష్మీకి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ సృజన షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. రెండు రోజుల్లోపు తన లిఖితపూర్వక వివరణను సమర్పించాలని, నిర్ణీత గడువులోగా వివరణ అందకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచడానికి వచ్చిన సమయంలో ఓ వ్యక్తిపై మహిళా వీఆర్వో చేయి చేసుకుంది.

వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది. ఆ అధికారి ఓ వ్యక్తిని చెంపపై కొట్టడాన్ని అక్కడున్న కొందరిలో వీడియో తీశారు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. స్థానికులపై దుర్భాషలాడుతూ ప్రవర్తించింది. అంతేకాకుండా.. తన భర్తను తీసుకొచ్చి బెదిరిస్తుందని ఆరోపించారు. అక్కడున్న పోలీసులు ఏమీ పట్టించుకోకుండా.. వీఆర్వోకే సపోర్ట్ చేస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని.. వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా.. ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం స్వయంగా ఆదేశిస్తున్నా మారని కొందరి ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. తీరు మారని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.