24 గంటల్లో పాస్ పోర్టులు అప్పగించండి.. జోగిరమేష్, దేవినేని అవినాష్ కు సుప్రీం ఆదేశం | supreme court orders devineni avinash and jougu ramesh to surrender passports| tdp| office| cbn| house| attack
posted on Sep 13, 2024 12:48PM
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై , చంద్రబాబు నివాసంపై దాడి కేసులలో నిందితులు అయినా దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులలో నిందితులైన వీరిరువురూ ముందస్తు బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ హై కోర్టు వీరి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసినప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న వీరిద్దరూ, ముందస్తు బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు.
అయితే సుప్రీం కోర్టు సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదు. అయినా దేవినేని అవినాష్, జోగురమేష్ లు 24 గంటలలో ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులకు తమతమ పాస్ పోర్టులను అప్పగించాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలనీ, దర్యాప్తు అధికారులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వెళ్లాలనీ స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించకుంటే రక్షణ ఉండదని హెచ్చరించింది. దేవినేని అవినాష్ తెలుగుదేశం కేంద్రకార్యాలయంపై దాడి కేసులో నిందితుడు కాగా, జోగు రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు.