- 21 ఏళ్ల చిలుకకు ఆపరేషన్ చేసి తన ప్రాణాలను కాపాడిన పశువైద్యులు
-
చిలుక మెడలో ఉన్న కణితి తీసేసిన డాక్టర్ -
20 గ్రాముల కణితిని తొలగించి ప్రాణాలను కాపాడిన వైద్యుడు -
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఘటన.

మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో 21 ఏళ్ల చిలుకకు ఆపరేషన్ చేసి తన ప్రాణాలను కాపాడిన ప్రత్యేక కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. చిలుక మెడలో కణితి ఉందని, దాని వల్ల చిలుక ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఈ క్రమంలో.. పశు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాని మెడలోంచి 20 గ్రాముల కణితిని తొలగించి ప్రాణాలను కాపాడారు. కాగా.. పక్షుల్లో కణితి రావడం ఇదే తొలిసారి అని చికిత్స అందించిన వెటర్నరీ డాక్టర్ తెలిపారు.
సుమారు ఆరు నెలల క్రితం చిలుక యజమాని చిలుక మెడపై ఒక చిన్న కణితి ఉన్నట్లు గమనించాడు. అది క్రమంగా పెరుగుతూ వచ్చి చిలుకకు చాలా ఇబ్బంది కలిగించింది. దాని వల్ల అది సరిగ్గా పలుకలేకపోయింది.. తినలేకపోయింది. దీంతో.. యజమాని చికిత్స నిమిత్తం సత్నాలోని జిల్లా పశువైద్యశాల వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పశువైద్యులు చిలుక మెడలో కణితిని గుర్తించి, చిలుకకు ఆపరేషన్ చేయమని వ్యక్తికి సూచించారు. యజమాని అంగీకారం పొందిన అనంతరం వైద్యులు చిలుకకు సుమారు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి దాదాపు 20 గ్రాముల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం చిలుక పరిస్థితి ప్రమాదం నుంచి బయటపడిందని, పూర్తిగా క్షేమంగా ఆరోగ్యంగా ఉందని తెలిపారు.
ఈ క్రమంలో.. పశువైద్యాధికారి మాట్లాడుతూ, దాదాపు రెండు గంటల పాటు ఆపరేషన్ జరిగిందని అన్నారు. చిలుక బరువు 98 గ్రాములు.. దాని నుండి సుమారు 20 గ్రాముల కణితిని తొలగించామని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం రేవా వెటర్నరీ కళాశాలకు పంపామన్నారు. చిలుక మెడ భాగంలో కణితి తీసివేయడం చాలా కష్టమైన ఆపరేషన్ అని వైద్యుడు తెలిపారు. ఆపరేషన్ తర్వాత.. చిలుక పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు సరిగ్గా తింటోందని అన్నారు.